మీరట్ : యూపీలోని మీరట్ జిల్లా పస్వాడా గ్రామంలో మహిళ హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. ఘటనా స్ధలంలో లభించిన వస్తువుల ఆధారంగా పోలీస్ డాగ్ నిందితులను పట్టించింది. బాధితురాలిని ప్రియుడితో కలిసి ఓ మహిళ మట్టుబెట్టిందని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతంలో నిందితులకు సంబంధించిన చెప్పులు, వెంట్రుకల ఆధారంగా పోలీస్ డాగ్ నిందితుల ఆనవాళ్లను పసిగట్టింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్ట్ 19న గ్రామంలోని అటవీ ప్రాంతంలో లక్ష్మిరి (45) అనే మహిళ మృతదేహం లభించింది. మహిళను గొంతుకోసి పాశవికంగా హత్య చేశారు. దర్యాప్తులో భాగంగా శాంపిల్స్ను సేకరించేందుకు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలను పిలిపించారు. నేరం జరిగిన ప్రాంతం నుంచి కొన్ని వెంట్రుకలను, చెప్పులను సేకరించారు. వీటి ఆధారంగా పోలీస్ డాగ్ గ్రామంలోని ఓ మహిళ ఇంటి వద్దకు వెళ్లి ఆగింది.
పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా మహిళ నేరం అంగీకరించింది. తాను ప్రియుడితో కలిసిఉన్న సమయంలో బాధితురాలు చూసిందనే కోపంతో ప్రియుడితో కలిసి ఆమెను హత్య చేశామని వెల్లడించింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.