లక్నో: న్యాయవాది తనను వేధిస్తున్నాడంటూ ఒక మహిళా జడ్జీ ఆరోపించింది. అతడు తన వెంట పడుతున్నాడని, తన మొబైల్ ఫోన్కు మెసేజ్లు పంపుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తర ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హమీర్పూర్ కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా న్యాయమూర్తి ఒంటరిగా నివసిస్తున్నది. అయితే మహ్మద్ హరూన్ అనే లాయర్ ఆమెను వేధిస్తున్నాడు. సాయంత్రం వాక్ చేస్తున్నప్పుడు ఆమె వెంటపడి అనుసరించేవాడు. ఆమె వేసుకున్న రంగుల దుస్తులు, బూట్లు వేసుకునేవాడు.
ఆ మహిళా న్యాయమూర్తి మొబైల్ ఫోన్కు మెజేస్లు కూడా న్యాయవాది మహ్మద్ హరూన్ పంపుతున్నాడు. అంతేగాక గోడలోని కన్నం నుంచి ఆమె ఆఫీస్లోకి పదే పదే తొంగి చూసేవాడు. ఆమె పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతడు లెక్కలేయక వీటిని కొనసాగిస్తున్నాడు.
దీంతో విసిగిపోయిన ఆ మహిళా జడ్జీ చివరకు లాయర్ మహ్మద్ హరూన్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు పంపిన మెసేజ్ల స్క్రీన్ షాట్లను అందజేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ అనూప్ కుమార్ తెలిపారు.