న్యూఢిల్లీ : సమాజంలో మానవ సంబంధాలు దిగజారిన తీరుకు అద్దం పడుతూ హర్యానాలో దారుణ ఉదంతం వెలుగుచూసింది. ఆస్తి కోసం మామను హత్య చేసిన కోడలిపై ఫరీదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వల్లభ్ఘఢ్కు చెందిన భరత్ సింగ్ భాటిని గురువారం రాత్రి ఆయన కోడలు హత్య చేసింది. హత్యకు పాల్పడిన నిందితురాలు గీత ప్రస్తుతం పరారీలో ఉంది.
గురువారం తెల్లవారుజామున తన భర్త గొంతు నుంచి రక్తం కారుతోందని, ఆయన విగతజీవిగా పడిఉన్నాడని భార్య జశోదా భాటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యానంతరం కోడలు గీత కనిపించడం లేదని ఆమె తెలిపారు. ఆస్తిని తన పేరున బదలాయించాలని గతంలో కోడలు బెదిరించిందని, ఈ వివాదంతోనే మరో వ్యక్తి సాయంతో తన భర్తను హత్య చేసిందని జశోదా భాటి తన ఫిర్యాదులో ఆరోపించారు.
హత్య జరిగిన రాత్రి గీతతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి ఇంట్లోకి వచ్చినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. వల్లభ్ఘఢ్ పోలీస్స్టేషన్లో గీతపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు చెప్పారు.