హైదరాబాద్ : మద్యం దుకాణంలో భారీగా నగదు చోరీ చేసిన వర్కర్ను నగరంలోని కుషాయిగూడ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఇంజినీరింగ్ డ్రాప్అవుట్ అయిన బి.సునీల్(33) చింతలకుంటలో గల సాయిదుర్గ వైన్స్లో గత మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. ప్రతీరోజు ఆ రోజు కలెక్షన్స్ను తీసుకుని చైతన్యపురిలో ఉండే షాపు యజమాని రామచంద్రారెడ్డికి ఇస్తుండేవాడు. బోనాల నేపథ్యంలో ఈ నెల 1, 2 తేదీల్లో నగరంలో డ్రై డే గా ఉంది. దీంతో జులై 31వ తేదీన భారీగా గిరాకీ అయింది. ఆ రోజు వసూలు అయిన నగదు రూ.22.3 లక్షలను యజమానికి ఇచ్చేందుకు వెళ్లి ఇయ్యకుండానే పరారయ్యాడు. దీంతో దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రూ.22.1 లక్షలను రికవరీ చేశారు.