సిద్దిపేట టౌన్ : ఇష్టంలేని పెండ్లి చేశారని ఓ మహిళ ప్రియుడితో కలిసి పెండ్లయిన నెలన్నరకే భర్తను హత మార్చింది. భర్తను అడ్డు తొలగించుకొకునేందుకు నెలన్నరలోనే రెండుసార్లు హత్యాయత్నం చేయడం గమనార్హం. సిద్దిపేట టూటౌన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన చంద్రశేఖర్ (24)కు, తొగుట్ట మండలం గుడికందులకు చెందిన శ్యామలతో మార్చి 23న వివాహం జరిగింది. మొదటి నుంచి పెండ్లి ఇష్టంలేని శ్యామల.. భర్తను అంతమొందించాలని ప్రియుడు శివకుమార్తో కలిసి పథకం పన్నింది. అందులో భాగంగా మొదటిసారిగా ఏప్రిల్ 19న భర్తకు అన్నంలో ఎలుకల మందు కలిపింది. దవాఖానలో చికిత్సపొందిన చంద్రశేఖర్ బతికాడు. అనంతరం ఏప్రిల్ 28న అనంతసాగర్ సరస్వతీ ఆలయానికి వెళ్దామని చంద్రశేఖర్ను ఒప్పించి, బైక్పై సిద్దిపేటకు తీసుకొచ్చింది. స్థానిక వెంకటేశ్వర ఆలయంలో దర్శనం చేసుకొని, అక్కడి నుంచి అనంతసాగర్కు తీసుకెళ్లింది.
పథకం ప్రకారం అప్పటికే ప్రియుడు శివకుమార్తోపాటు అతని స్నేహితులు రాకేశ్, రంజిత్, బంధువులు సాయికృష్ణ, భార్గవ్ ఆల యం వద్దకు కారులో చేరుకొన్నారు. బైక్పై వచ్చిన చంద్రశేఖర్ను శివకుమార్ కారుతో ఢీకొట్టాడు. గొడవపడ్డట్టు నటించి, కిందపడ్డ చంద్రశేఖర్ మెడకు శ్యామల, శివకుమార్ తువ్వాలతో బిగించి, లాగుతూ పొదల్లోకి తీసుకెళ్లి హతమార్చారు. శవాన్ని కారులో వేసుకొని సిద్దిపేట శివారులోని హనుమాన్నగర్కు తీసుకొచ్చారు. శ్యామల కుటుంబీకులకు ఫోన్చేసి, ఊపిరాడక చంద్రశేఖర్ చనిపోయాడని నమ్మబలికింది. తన కొడుకు మృతిపై అనుమానం ఉన్నదని మృతుడి తల్లి మణెవ్వ అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కూపీ లాగగా, హత్యోదంతం బయటికి వచ్చింది. శ్యామల కాల్డాటా ఆధారంగా విచారణ జరుపడంతో విషయం బయటపడింది.