Rangareddy | రంగారెడ్డి : క్షణికావేశంలో ఓ భర్త( Husband ) తన భార్య( Wife )ను గొడ్డలితో నరికి చంపాడు. నెలన్నర పసికందు( Child )ను నీటి సంపులో పడేశాడు. ఈ దారుణ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని అనాజ్పూర్లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అనాజ్పూర్( Anazpur ) గ్రామానికి చెందిన ఏర్పుల ధన్రాజ్కు లావణ్య అనే యువతితో కొన్నేండ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు కూతరు ఆద్య(3), నెలన్నర కుమారుడు ఉన్నారు. అయితే డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన లావణ్య.. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అత్తగారింటికి తిరిగొచ్చింది. ఇంట్లోకి వెళ్లిన కాసేపటికే లావణ్యపై ధన్రాజ్ గొడ్డలితో దాడి చేశాడు. మెడకు తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లిపై గొడ్డలితో దాడి చేయడాన్ని చూసిన ఆద్య.. భయపడి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. నెలన్నర పసికందును నీటి సంపులో పడేశాడు ధన్రాజ్.
ఇక భార్య, కుమారుడిని చంపిన ధన్రాజ్ అందరూ చూస్తుండగానే, రక్తపు మరకలు అంటిన బట్టలతోనే పరారైయ్యాడు. స్థానికులు అందించిన సమాచారంతో వనస్థలిపురం( Vanasthalipuram ) ఏసీపీ పురుషోత్తం ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి( Osmania Hospital )కి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ధన్ రాజ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.