భోపాల్ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి కారులో మృతదేహాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కు చేరుకున్న భార్య ఉదంతం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో కలకలం రేపింది. కటారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగీత మీనా (34) ఆమె ప్రియుడు ఆశిష్ పాండే (32) బాధితుడు ధన్రాజ్ మీనా (40)చే నిద్రమాత్రలు మింగించి ఆపై కర్రలు, పదునైన ఆయుధంతో కొట్టారు.
సాగర్ గోల్డెన్ పార్క్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆశిష్ పాండేకు తన భార్య మీనాతో వివాహేతర సంబంధం ఉందని పసిగట్టిన ధన్రాజ్ వీరిద్దరినీ వారించాడు. ఈ విషయమై పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ధనరాజ్ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న పాండే, సంగీత మీనా తమ ప్లాన్ను అమలు చేశారు. మత్తుమందు ఇచ్చి పదునైన ఆయుధం, కర్రలతో బాధితుడిని కొట్టిచంపారు. ఇక ఎలాగైనా దొరికిపోతామని భావించిన భార్య సంగీత కారులో మృతదేహాన్ని తీసుకుని నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు.