ములుగు : అగ్నిసాక్షిగా ఒకరికి ఒకరం తోడుంటామని వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట.. మృత్యువులోను ఒక్కటయ్యారు. భార్య ఫిట్స్తో మృతి చెందగా..గంట వ్యవధిలోనే గుండెపోటుతో భర్త మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన వెంకటాపూర్ మండల కేంద్రంలోని తాళ్లపాడులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..తాళ్లపాడుకు చెందిన మాసపత్రి రాజయ్య (75) స్వరూప (70) దంపతులు. రాజయ్య సింగరేణి కార్మికుడిగా పనిచేసి పదవీ విరమణ చేసి తాళ్లపాడులో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రాజయ్య భార్య స్వరూపకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది.
భార్య స్వరూప మృతితో తీవ్రంగా కలత చెందిన రాజయ్య గంట సేపటి తర్వాత గుండెపోటు రావడంతో రాజయ్య కూడా మృతి చెందాడు. రాజయ్య, స్వరూప దంపతులకు ముగ్గురు కొడుకులు కాగా వారు వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నారు. గంట వ్యవధిలోనే భార్యాభర్తలు మృతిచెందంటంతో గ్రామంలో విషాదం నెలకొంది.