కోల్కతా: తన అనుమతి లేకుండా స్మార్ట్ ఫోన్ కొన్న భార్యను హత్య చేయాలని భర్త భావించాడు. దీని కోసం కాంట్రాక్ట్ కిల్లర్స్ను నియమించాడు. అయితే హత్యాయత్నం నుంచి ఆమె తప్పించుకుంది. తీవ్ర గాయాలతో బయటపడింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ దారుణం జరిగింది. నరేంద్రపూర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ స్మార్ట్ ఫోన్ కొనమని భర్తను అడిగింది. అయితే అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ట్యూషన్ల ద్వారా సంపాదించిన డబ్బుతో జనవరి 1న స్మార్ట్ మొబైల్ ఫోన్ను ఆమె కొన్నది.
కాగా, ఈ విషయం తెలిసిన భర్త ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చంపుతానని భార్యను బెదిరించాడు. అంతేగాక ఆమెను హత్య చేసేందుకు కాంట్రాక్స్ కిల్లర్స్ను నియమించాడు. వారికి సుపారీ కూడా ఇచ్చాడు. ప్లాన్ ప్రకారం ఈ నెల 20వ తేదీ గురువారం రాత్రి ఇంటి తలుపును లాక్ చేసేందుకు భర్త వెళ్లాడు. అయితే ఎంతకీ తిరిగి రాకపోవడంతో కంగారు పడిన భార్య చూసేందుకు వెళ్లింది. ఇంతలో అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు కత్తితో ఆమెపై దాడి చేశారు.
మరోవైపు ఆ మహిళ, హత్యాయత్నం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. కత్తి దాడి వల్ల గొంతు వద్ద గాయం కావడంతో రక్తం కారింది. ఆందోళన చెందిన ఆమె, భయంతో కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు పరుగెత్తింది.ఆమె అరుపులు విన్న పొరుగువారు అక్కడకు వచ్చారు. ఆ మహిళపై దాడి చేసిన వ్యక్తితోపాటు ఆమె భర్తను పట్టుకున్నారు. దాడి చేసిన మరో వ్యక్తి తప్పించుకుని పారిపోయాడు.
కాగా, గొంతు వద్ద కత్తి గాయమైన ఆమెకు ఏడు కుట్లుపడ్డాయి. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు పోలీసులు భర్త రాజేష్ ఝా, కిరాయి దుండగుడు సూరజిత్ను అరెస్ట్ చేశారు. పరీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.