మైలార్దేవ్పల్లి : విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాటేదాన్ ఓల్డ్ కర్నూల్ రోడ్డు దర్గా సమీపంలోని శ్రీరామ్కాలనీకి చెందిన దండు శివకుమార్ (25) నిలోఫర్ ఆసుపత్రిలో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అతనికి ఆరు నెలల క్రితమే పెళ్లయ్యింది.
రోజు మాదిరిగానే డ్యూటీ అయిన వెంటనే ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దర్గా సమీపంలో రోడ్డు సరిగా లేక పోవడంతో టీఎస్ 07 ఎఫ్హెచ్ 5068 బైక్ అదుపు తప్పి కుడి వైపు పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న ఏపి 29 టిఏ 4077 కంటైనర్ అతనిపై నుండి వెళ్లిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుతున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొన్నారు.
ట్రాఫిక్ ఏసీపీ ఏ వి ప్రసాద్ ,సీఐ శామ్ప్రసాద్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామని మైలార్దేవ్పల్లి సీఐ కె నర్సింహ తెలిపారు. రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు ఎఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనం జైపాల్రెడ్డి ఆరోపించారు. ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యంతోనే యువకుడు మృతి చెందాడని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.