జైపూర్ : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ తన ప్రియురాలికి మరొకరితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రేమికుడు.. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్లోని జోధ్పూర్లో మంగళవారం ఉదయం వెలుగు చూసింది.
రాజస్థాన్ పాలి జిల్లాకు చెందిన లక్షిత.. న్యాయ విద్యను అభ్యసిస్తోంది. నాగౌర్ జిల్లాలో బట్టల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్న హేమంత్తో లక్షితకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా ఐదేండ్ల నుంచి లక్షిత, హేమంత్ ప్రేమించుకుంటున్నారు. కానీ లక్షితకు ఏడు రోజుల క్రితం మరో యువకుడితో నిశ్చితార్ధం జరిగింది. తన ప్రియురాలికి మరొకరితో వివాహం జరుగుతందని తెలియడంతో హేమంత్ తట్టుకోలేకపోయాడు.
సోమవారం రాత్రి లక్షితను జోద్పూర్లోని ఓ హోటల్కు హేమంత్ పిలిపించాడు. ఆ రోజు రాత్రి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు దక్కని లక్షిత వేరే వారికి దక్కొద్దనే ఉద్దేశంతో.. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె శరీరంపై 10 చోట్ల కత్తితో పొడిచాడు. ఆ తర్వాత తాను కూడా బయటకు వెళ్లి.. సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్నాడు. హేమంత్ శరీరంపై నుంచి రైలు దూసుకెళ్లడంతో.. శరీరం రెండు ముక్కలైంది. లక్షిత, హేమంత్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.