న్యూఢిల్లీ: జనమంతా చూస్తుండగా రోడ్డుపై కొందరిని మరి కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. కర్రలు, క్రికెట్ బ్యాట్లతో దాడి చేశారు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు ఈ ఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పూర్ ప్రాంతంలో కర్రలు, బ్యాట్లు చేతపట్టిన కొందరు వ్యక్తులు అక్కడ అలజడి సృష్టించారు. అంతా చూస్తుండగా వారి బంధువులపై దాడి చేశారు. ఇష్టమెచ్చినట్లుగా దారుణంగా కొట్టారు. దీంతో భీతిల్లిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు. అల్లర్ల వంటి పరిస్థితిని నియంత్రించారు. గాయపడిన వారిని జేపీసీ ఆసుపత్రికి తరలించారు. దాడులకు పాల్పడిన నలుగురిని జగత్ (62), హరేందర్ (41), సుమిత్ (29), అమిత్ (24)గా గుర్తించారు. జగత్ను అరెస్టు చేశారు.
కాగా, రెండు కుటుంబాల మధ్య ఉన్న పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ తనంటే భయపడాలని జగత్ భావించాడని, వివాదం ఉన్న ఆస్తి వద్ద అడ్వకేట్, బీజేపీ పేరుతో నకిలీ బోర్డులు పెట్టాడని ఈశాన్య ఢిల్లీ డీసీపీ సంజయ్ సైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో దీనిని ప్రశ్నించిన శ్యామ్, మరికొందరు బంధువులపై జగత్, అతడి కుమారులు దాడి చేశారని చెప్పారు.
ఇరు కుటుంబాలు ఈ ప్రాంతంలో గతంలో కూడా కొట్టుకున్నాయని, వారిపై పాత కేసులు కూడా ఉన్నాయని డీసీపీ సంజయ్ తెలిపారు. ఎలాంటి అల్లర్లకు పాల్పడబోమని, శాంతియుతంగా ఉంటామని చెప్పారని, అయితే తిరిగి దాడులకు పాల్పడి స్థానికులను భయాందోళనకు గురి చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నకిలీ బోర్డుల విషయాన్ని బీజేపీతోపాటు బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
మరోవైపు స్థానికులు తమ మొబైల్లో రికార్డు చేసిన ఈ దాడుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేశారు.
– incident took place in Northeast Delhi's New Usmanpur area. One accused has been arrested. pic.twitter.com/mMllfvLAVo
— Mahender Singh Manral (@mahendermanral) February 12, 2022