అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న వరుస ఘటనలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన సామూహిక అత్యాచారం, నెల్లూరులో మరో ఘటన , నిన్న రేపల్లే రైల్వేస్టేషన్లో ఘటనను మరువక ముందే విజయనగరం జిల్లా కేంద్రం ఉడాకాలనీలో మహిళపై అర్ధరాత్రి అత్యాచారం జరిగింది.
పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఉపాధి కోసం వచ్చిన మహిళ విజయనగరంలో టీ దుకాణం నిర్వహిస్తుంది. మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. అయితే మహిళపై కన్నేసిన ఇద్దరు కామాంధులు సోమవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడి లైంగికదాడికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.