బెంగళూరు: రుణ దరఖాస్తును తిరస్కరించినందుకు ఒక వ్యక్తి, ఏకంగా బ్యాంకునే తగులబెట్టాడు. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రట్టిహళ్లి పట్టణానికి చెందిన వాసిం హజరత్సాబ్ ముల్లా, ఇటీవల కాగినెల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెడుగొండ గ్రామంలో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్లో లోన్ కోసం దరఖాస్తు చేశాడు. రుణం పొందేందుకు అన్ని పత్రాలు సమర్పించాడు. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నందున అతడి లోన్ అప్లికేషన్ను బ్యాంక్ తిరస్కరించింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ముల్లా, శనివారం రాత్రి వేళ ఆ బ్యాంక్ శాఖకు చేరుకున్నాడు. కిటికీ పగులగొట్టి బ్యాంక్ లోపల పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాగా, మంటలు రాజుకుని పొగలు ఎగసిపడుతుండటాన్ని అటుగా వెళ్తున్న కొందరు చూశాడు. అక్కడి నుంచి పారిపోతున్న ముల్లాను పట్టుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.
కాగా, ఈ ఘటనలో బ్యాంకుకు రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లింది. బ్యాంకులోని ఐదు కంప్యూటర్లు, పాస్బుక్ ప్రింటర్, క్యాష్ కౌంటింగ్ మెషిన్, క్యాష్ కౌంటర్ ఫర్నీచర్, పలు పత్రాలు,ఫ్యాన్లు, లైట్లు, సీసీటీవీలు కాలిపోయాయి. దీంతో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు నిందితుడు ముల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.