లక్నో: మాజీ భార్య సవతి తల్లి అయ్యిందన్న విషయం తెలుసుకుని ఒక వ్యక్తి షాక్ అయ్యాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని బడాన్లో ఈ ఘటన జరిగింది. 2016లో మైనర్లైన ఒక జంటకు పెండ్లి జరిగింది. ఆరు నెలల తర్వాత వారిద్దరు విడిపోయారు. మేజర్ అయిన తర్వాత కలిసి ఉండేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించగా ఆ యువతి నిరాకరించింది. అతడ్ని తాగుబోతుగా ఆరోపించి విడాకులు డిమాండ్ చేసింది.
మరోవైపు పారిశుధ్య కార్మికుడిగా పని చేసే ఆ వ్యక్తి తండ్రి కొంత కాలంగా అతడికి డబ్బులు ఇవ్వడం లేదు. ఆయన సంభల్లో విడిగా ఉంటున్నాడు. దీంతో ఆ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా తన 48 ఏండ్ల తండ్రి గురించి సమాచారం కోరాడు. తన మాజీ భార్యను తండ్రి పెండ్లి చేసుకున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. దీనిపై బిసౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ నేపథ్యంలో పోలీసులు శనివారం ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. కాగా, సవతి తల్లిగా మారిన మాజీ భార్య మొదటి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. అతడి తండ్రిని పెండ్లి చేసుకున్న తాను సంతోషంగా ఉన్నట్లు పోలీసులకు చెప్పింది. దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. మొదటి పెండ్లికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఆరా తీశారు. మరోసారి పిలిపించి మాట్లాడతామని చెప్పి వారిని పంపివేశారు.