శేరిలింగంపల్లి :తలపై బండరాయితో మోది గుర్తు తెలియని ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. రాయదుర్గం ప్రధాన రహదారికి పక్కన ఉన్న బస్స్టాప్లో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబందించిన వివరాలు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… రాయదుర్గం స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న బస్స్టాప్లో సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి హత్యకు గురై పడిఉన్నట్టు స్థానికులు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వయస్సు 35నుంచి 40 సంవత్సరాలు ఉంటాయని,ఒంటిపై బుడిద, నీలం రంగు చొక్కా, నీలం రంగు ప్యాంటు, తెల్లని బనియన్, మెరున్ రంగు డ్రాయర్ ధరించి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, తలపై బండరాయితో గట్టిగా మోదడంతో సదరు గుర్తు తెలియని వ్యక్తి రక్తపు మడుగులో పడి చనిపోయినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. మృతుడి ఆనవాళ్లు బట్టి చూస్తే అతడు ముస్లిం అయి ఉండవచ్చనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతుడి పక్కనే రక్తపు మరకలు కలిగిన బండరాయి సైతం సంఘటన స్థలంలో పోలీసులు గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం తెల్లవారుజామున దుండగులు బస్స్టాప్లో మృతుడిని తలపై బండరాయితోమోది హత్య చేసినట్లు తెలుస్తుందని తెలిపారు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో మృతుడు వివరాలు, హత్యకు పాల్పడిన దుండగుల వివరాల సేకరించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.