అమీర్పేటలోని ధరకరం రోడ్డు ప్రాంతానికి చెందిన ఇద్దరు వృద్ధ మహిళలను కిడ్నాప్ చేసి అమీన్పూర్లో బంధించిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వృద్ధులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం వారిని అమీన్పూర్లోని ఓ ఇంట్లో బంధించారు. వారిద్దరు కేకలు వేయడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని రక్షించి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అనంతరం అమీన్పూర్ పీఎస్ నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కేసును బదిలీ చేశారు. అయితే కిడ్నాప్ చేసిన దుండగులు కీలకమైన ల్యాండ్ డాక్యుమెంట్లు, కొంత బంగారాన్ని తీసుకువెళ్లారని బాధితులు చెబుతున్నారు. మీరాజ్ అహ్మద్ ఖురేషి అనే వ్యక్తి ఈ కిడ్నాప్కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మీరాజ్తో పాటు మరో నలుగురిపై కిడ్నాప్, దాడి కేసులను నమోదు చేశారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. కాగా ధరంకరం రోడ్డులో ప్రస్తుతం వృద్దులు నివాసం ఉంటున్న కోట్లాది రూపాయల విలువచేసే స్థలం కోసమే ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.