అహ్మదాబాద్ : భర్త బయటకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన అహ్మదాబాద్లో వెలుగుచూసింది. భర్తతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్న యువతి (19) సోమవారం ఫోన్లో సినిమా చూస్తుండగా ఇంట్లోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు దారుణానికి తెగబడ్డారు.
రాజు అనే వ్యక్తి కోసం తాము వచ్చామని వారు చెప్పగా అతడు ఎవరో తనకు తెలియదని ఆమె బదులిచ్చింది. ఆపై ఇద్దరు దుండగులు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మహిళ సాయం కోసం కేకలు వేయగా వారు బ్లేడుతో దాడి చేసి పరారయ్యారు. గాయాలతో మహిళ పడిఉండగా అక్కడికి చేరుకున్న స్ధానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరో ఘటనలో మహిళను లైంగిక వేధింపులకు గురిచేసి హింసించిన నలుగురు వ్యక్తులపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె భర్తపై దాడి కేసులో రాజీ పడాలని బెదిరిస్తూ వారు ఈ దారుణానికి తెగబడ్డారని పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.