న్యూఢిల్లీ : దేశ రాజధానిలో యువతులు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగం ఆశచూపి బాలికపై ఇద్దరు వ్యక్తులు ఢిల్లీలోని జనక్పురి ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కుటుంబం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటుండగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మహిళ బంధువు సూచించడంతో ఓ వ్యక్తిని సంప్రదించింది.
జనక్పురి ఫ్లైఓవర్ వద్ద కారులో మరో వ్యక్తితో ఉన్న నిందితుడు ఆమెను అక్కడికి పిలిపించి కారులో కూర్చోవాలని కోరాడు. ఆమెకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. బాలిక స్ప్రహ కోల్పోగానే కారులోనే నిందితులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికను రోడ్డుపై విడిచిపెట్టి ఘటనా స్ధలం నుంచి పరారయ్యారు.
బాలిక అంబేడ్కర్ నగర్ పోలీస్ స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేసింది. వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు నిరాకరించడంతో మహిళా హెల్ప్లైన్ను సంప్రదించగా వారి సాయంతో జనక్పురి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉద్యోగం ఆశచూపి నిందితులు ఇద్దరు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.