సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారే వారి పాలిట మృత్యు శకుటమైంది. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని వలస వచ్చిన ఇద్దరు కూలీలను ఓ కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా పరిధిలోని బొల్లారం రింగ్ రోడ్డుపై గురువారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఎప్పటిలాగే వాటర్ ట్యాంకర్తో చెట్లకు నీళ్లు పడుతున్న నవీన్, సత్తయ్యను ఓ కారు అతివేగంగా వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కారులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు.
సత్తయ్య, నవీన్ మృతదేహాలను పటాన్ చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.