ముంబై : మహిళను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగుచూసింది. నిందితులను హర్షద్ జౌ పాటిల్ (26), క్రితేష్ అశోక్ కినీ (28)లుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 35 ఏండ్ల మహిళ మృతదేహం కుళ్లినస్ధితిలో గత నెల 27న మరంబల్ పద ప్రాంతంలో లభ్యమైంది. నీటిలో తోసివేసే ముందు నిందితులు మహిళ మృతదేహానికి పెద్ద బండరాయిని కట్టారు.
అర్ణల సగరి పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించి దర్యాప్తు ముమ్మరం చేయగా విరార్ పోలీస్ స్టేషన్లో అదృశ్యమైన మహిళ కేసులో పొందుపరిచిన ఆనవాళ్లు ఈ మృతదేహంతో సరిపోలాయి. దర్యాప్తును వేగవంతం చేయగా నిందితులిద్దరూ పట్టుబడ్డారు. పాటిల్కు గతంలో బాధితురాలితో వివాహేతర సంబంధం ఉందని, ఇద్దరి మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవని..దీంతో పాటిల్ మరో వ్యక్తితో కలిసి మహిళను హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేశాడని పోలీసులు తెలిపారు.