ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికూతుర్లు కూడా అక్కాచెల్లెళ్లే. అమ్మాయిలిద్దరూ పేద కుటుంబానికి చెందిన వారు. వారికి తండ్రి లేడు. వారి మేనమామ ఇంట్లో తమ తల్లితో ఉంటున్నారు. అదే గ్రామంలో వారికి మేనమామ పెళ్లి సంబంధం చూశాడు. అందరూ పెళ్లి ఏర్పాట్లో ఉండగా.. ఆ ఇద్దరు పెళ్లికూతుర్లు కనపడకుండా పోయారు. వారికోసం పోలీసులు విచారణ చేయగా.. షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్కు బఢారీ గ్రామానికి చెందిన 76 ఏళ్ల జగదంబా ప్రసాద్ దీక్షిత్కు ఇద్దరు కొడుకులున్నారు. వారికి వివాహం చేయాలని అతను అమ్మాయిల కోసం వెతుకుతుండగా.. పక్క గ్రామం సతానాకు చెందిన మన్సుఖ్ అనే ఒక పెళ్లిళ్ల సంబంధం కుదిర్చే ఏజెంట్ తనతోపాటు అరుణ్ కుమార్ తివారి అనే వ్యక్తిని తీసుకొచ్చాడు. అరుణ్ కుమార్ తన ఇద్దరు మేనకోడళ్ల గురించి చెప్పాడు. ఆ తరువాత జగదంబా ప్రసాద్ సతానాకు వెళ్లి ఒక పెద్ద ఇంట్లో ఇద్దరు అమ్మాయిలను చూశాడు. అక్కడ వారిద్దరి తల్లి కూడా ఉంది. ఇద్దరమ్మాయిలు అందంగా ఉండడంతో సంబంధం కుదుర్చుకున్నాడు.
పేదింటి అమ్మాయిలు కావడంతో పెళ్లి ఖర్చులు కూడా జగదంజా ప్రసాద్ పెట్టుకున్నాడు. అమ్మాయిలకు పెళ్లి బట్టలు, నగలు కొనేందుకు 2 లక్షల 50 వేల రూపాయలు కూడా ఇచ్చాడు. ఆ తరువాత నవంబర్ 29న వివాహం నిశ్చయించుకున్నారు. కానీ పెళ్లికి ముందురోజు పెళ్లికూతుర్ల తల్లి ఫోన్ చేసి పెళ్లి వాయిదా వేయమని కోరింది. తమ కుటుంబ బంధువు ఒకరు చనిపోయారని చెప్పింది. దానికి జగదంబా ప్రసాద్ సరేనన్నాడు. మరుసటిరోజు చనిపోయిన వారి కుటుంబానికి పరామర్శిద్దామని జగదంబా ప్రసాద్ సతానా వెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. ఇల్లంతా ఖాళీగా ఉంది.
ఎంత వెతికినా అరుణ్ కుమార్ తివారి, పెళ్లికూతుర్లు, వారి తల్లి జాడ తెలియలేదు. వారి ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోంది. దీంతో జగదంబాకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేసి ఆ ఇద్దరు పెళ్లికూతుర్ల తల్లి, మేనమామ, పెళ్లి సంబంధాల ఏజెంట్ని పట్టుకున్నారు. వారిని గట్టిగా ప్రశ్రించగా.. వారంతా ముఠాగా ఏర్పడి పెళ్లి సంబంధాల పేరుతో చాలామందిని దోచుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసులు నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చశారు. పెళ్లికూతుర్లుగా చెలామణి అయ్యే ఇద్దరు మోసగత్తెలు పరారీలో ఉన్నారు.