మరింత పకడ్బందీగా లాక్డౌన్
రోడ్లపై పోలీసుల నిరంతర నిఘా
సరిహద్దుల వద్ద మరింత కఠినం
అనుమతి లేని వాహనాల నిలిపివేత
నల్లగొండ ప్రతినిధి, మే14(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడో రోజూ లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలైంది. ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు సడలింపులో మినహా మిగతా సమయంలో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. నిత్యావసరాలు, ఇతర సామగ్రి తదితరాల కొనుగోలు కోసం ఉదయం 10గంటల వరకు ప్రజలు రోడ్లపైకి రావడంతో రద్దీ నెలకొంది. ప్రజలు కూరగాయలు, కిరాణం, మందుల లాంటి నిత్యావసర వస్తువుల కొనుగోలుకే ఎక్కువగా ప్రాధాన్యనిస్తున్నారు. నిర్ణీత సమయం ముగిశాక తిరిగి షాపులు మూతపడడం ప్రజలు ఇంటిబాట పట్టారు. పోలీసు పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం తిరుగుతూ దుకాణాలను మూసివేయాలని విజ్ఙప్తి చేస్తూ కనిపించాయి. 10 తర్వాత ఇండ్లల్లోనే ఉండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా బోసిపోయాయి.
అత్యవసరాలకు అనుమతి..
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులూ లేవు. ధాన్యం అమ్మకాలు, ఎరువులు, విత్తనాల కొనుగోలుకు కూడా ఆటంకాలు లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసి సిబ్బందిని గుర్తింపు కార్డులు చూపిస్తే అనుమతిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం పక్కగా వ్యవహరించే దిశగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
సరిహద్దుల్లో అటెన్షన్..
ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసు చెక్పోస్టులను మరింత కట్టుదిట్టం చేశారు. ఉదయం పూట సడలింపుల సమయంలోనూ వాహనాలను అనుమతించలేదు. ముందస్తు అనుమతి లేకుంటే రావడానికి వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. లాక్డౌన్ సడలింపులు కేవలం తెలంగాణ వాసులకేనని ఆంధ్ర నుంచి వస్తున్న వాహనదారులకు పోలీసులు వెల్లడించారు. దీంతో కొద్దిసేపు ఆంధ్రవైపు వాహనాల రద్దీ నెలకొంది. తర్వాత వాహనదారులు వెనక్కి వెళ్లిపోవడంతో సాధారణ పరిస్థితులు కొనసాగాయి. నాగార్జునసాగర్ పరిధిలోని కొత్త బ్రిడ్జి వద్ద ప్రతి వాహనానాన్నీ తనిఖీ చేశారు. కొవిడ్ చికిత్స మినహా మిగతా వ్యాధుల విషయంలో రోగులతో వచ్చిన అంబులెన్స్లను పోలీసులు అనుమతించారు. కానీ కొవిడ్ చికిత్స విషయంలో కొవిడ్ కమాండ్ కంట్రోల్ నుంచి జారీ చేసిన పాసులు ఉంటేనే అంబులెన్స్లను హైదరాబాద్కు వెళ్లనిచ్చారు. ఇక నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై దామరచర్ల మండలం వాడపల్లి వద్ద, కోదాడ మండలం రామాపురం వద్ద కూడా అనుమతి ఉంటేనే తెలంగాణ రాష్ట్రంలోకి రానిచ్చారు.వాడపల్లి వద్ద పరిస్థితిని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ సమీక్షించారు. చెక్పోస్టు పోలీసులకు తగిన సూచనలు ఇస్తూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశించారు.