ముంబై: భారీ కంటైనర్ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతోపాటు దానిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణిస్తున్న నాలుగేండ్ల బాలుడితోసహా ముగ్గురు మరణించారు. మహారాష్ట్రలోని ముంబై-పూణే ఎక్స్ప్రెస్వేపై గురువారం ఈ ఘటన జరిగింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబం హ్యుందాయ్ ఐ 10 కారులో పూణే నుంచి వాసై సమీపంలోని నైగావ్లో తమ ఇంటికి తిరిగి వస్తున్నది. ఇంతలో నియంత్రణ కోల్పోయిన ఒక కంటైనర్ లారీ ఆ కారును ఢీకొట్టింది. అదుపుతప్పిన కారు మరో లారీని ఢీకొట్టగా వెనుక వచ్చిన ఆ కంటైనర్ లారీ ఆ కారు మీదుగా దూసుకుపోయింది. అనంతరం అదుపుతప్పి రోడ్డుపై బోల్తాకొట్టింది. మరోవైపు కారుకు మంటలు అంటుకుని క్షణాల్లో దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న జోక్విమ్ చెట్టియార్ (36), ఆయన భార్య లూయిజా (35), వారి కుమారుడు జాజియల్ (4) అక్కడికక్కడే చనిపోయారు.
హైవే పోలీస్ పెట్రోలింగ్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి వచ్చింది. తీవ్రంగా గాయపడిన కంటైనర్ డ్రైవర్ రమేష్ నికంను కాపాడి ఆసుపత్రికి తరలించింది. కారును ఢీకొట్టి ముగ్గురు మరణానికి కారణమైన అతడిపై ఐపీసీలోని సంబధిత సెక్షన్లతో తోపాటు మోటార్ వాహన చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ముందు వెళ్తున్న ఒక లారీ నుంచి రికార్డు చేసిన ఈ ప్రమాద దృశ్యాల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.