యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ పరిధిలోని విజయవాడ – హైదరాబాద్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు సరుకు లోడ్తో వెళ్తున్న డీసీఎంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డీసీఎం డ్రైవర్.. వాహనాన్ని ఆపి కిందకు దిగాడు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసింది. 80 శాతం వరకు డీసీఎం దగ్ధమైంది. మంటల ధాటికి దగ్ధమైన సరుకు విలువ రూ. కోటి వరకు ఉంటుందని డ్రైవర్ తెలిపాడు. అయితే డీసీఎం బ్యాటరీలో విద్యుత్ షాక్ సంభవించడంతోనే మంటలు ఎగిసిపడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.