చార్మినార్ : కడుపు నొప్పితో భాదపడుతూ ఆసుపత్రిలో చేరితే వార్డుబాయ్ అందించిన వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అస్తారాయ్ కొన్నేండ్ల క్రితం కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి చార్మినార్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఘాన్సీ బజార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.
బుధవారం సాయంత్రం కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని మెడ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. రాత్రి 10గంటల సమయంలో కడుపు నొప్పి మరింత తీవ్రంగా కావడంతో కుటుంబ సభ్యులు డాక్టర్కు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు.
అయితే డాక్టర్ ఉదయం వరకు రారు అని చెప్పిన వార్డు బాయ్ అబ్థుల్ సత్తార్ కడుపు నొప్పి తగ్గడం కోసమని అస్తారాయ్కు ఓ ఇంజక్షన్ చేశాడు. ఆ తర్వాత అస్తారాయ్ నొప్పి మరింత పెరిగి తెల్లవారు జామున మృతి చెందాడు.
దీంతో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోపాటు వార్డుబాయ్ అందించిన చికిత్స అస్తారాయ్ ప్రాణాలు తీసిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు మెడ్స్ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న చార్మినార్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదిక అందిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చార్మినార్ ఇన్స్పెక్టర్ గురునాయుడు తెలిపారు.