సిద్దిపేట : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బతుకమ్మ పండగకు సంతోషంగా పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చిన..తల్లీకూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ హృదయవిదాకర సంఘటన దుబ్బాక మండలం ఎనగుర్తిలో చోటుచేసుకుంది.
గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన ఎనగుర్తి భారతమ్మ ,మల్లయ్య దంపతుల చిన్న కూతురు రోజాకు పదేండ్ల కిందట మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లికి చెందిన చెప్యాల నరేష్తో వివాహం జరిగింది. వీరికి రేష్మిక, చైత్ర ఇద్దరు కూతుళ్లున్నారు.
ఈ క్రమంలో బతుకమ్మ పండుగ సందర్భంగా.. రోజా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పుట్టింటికి వచ్చింది. గురువారం ఉదయం స్థానిక బండకుంట చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు రోజా తన కూతుళ్లను వెంట తీసుకెళ్లింది.
చెరువు గట్టుపై తన కూతుళ్లను ఆడుకోమ్మని చెప్పి రోజా చెరువులో బట్టలు ఉతికేందుకు దిగింది. ఈ క్రమంలో రోజా చిన్న కూతురు చైత్ర(4) గట్టుపై నుంచి జారీ చెరువులో పడిపోయింది. పెద్ద కూతురు రేష్మిక కేకలు వేయటంతో గమణించిన రోజా చైత్రను కాపాడేందుకు వెళ్లి నీళ్లోమునిగింది.
చెరువులో నుంచి తల్లి, చెల్లి బయటకు రాకపోవటంతో రేష్మిక ఏడుస్తూ..అమ్మమ్మ ఇంటికి వెళ్లి సమాచారం అందించింది. వారితో పాటు చుట్టుపక్కల వారు చెరువు వద్దకు వెళ్లారు. గజ ఈతగాళ్ల సహాయంతో తల్లీకూతుళ్ల (రోజా, చైత్రల) మృతదేహాలను బయటకు తీశారు. పండగకు సంతోషంగా వచ్చిన కూతురు, మనువరాలు తిరిగిరాని లోకాలకు వెళ్లటం పట్ల రోజా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం దుబ్బాక సర్కారు దవాకాణకు తరలించారు.