మలక్పేట : రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుకు స్వల్ప గాయాలవగా, మరో కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్దరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం అంబర్పేటకు చెందిన మహ్మద్ రహీముద్దీన్ (45) తన ఇద్దరు కుమారులతో కలిసి యాక్టీవా వాహనంపై చాంద్రాయణగుట్టలో ఫంక్షన్కు హాజరై అర్దరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు.
మార్గమధ్యలో మూసారాంబాగ్ సలీంనగర్లోని స్వామి వివేకానంద స్కూల్వద్దకు రాగానే స్పీడ్ బ్రేకర్ వద్ద వాహన వేగాన్ని తగ్గించగా, వెనుక నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ (టీఎస్ 11 ఎక్యూ 9676) వాహనంపై వచ్చిన మల్కాజ్గిరికి చెందిన సాయితేజ, వేణులు ఢీకొట్టారు.
ఈ సంఘటనలో మహ్మద్ రహీముద్దీన్కు, అతని చిన్న కుమారుడు అబ్దుల్ రహమాన్ (10)కు స్వల్ప గాయాలవగా, పెద్ద కుమారుడు మహ్మద్ ఉమర్(15) తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108 వాహనాన్ని రప్పించగా, మహ్మద్ రహీముద్దీన్ చికిత్స నిమిత్తం యశోద దవాఖానాలో చేర్పించారు.
తలకు తీవ్ర గాయాలవటంతో కోమాలోకి వెళ్లాడని, ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహ్మద్ రహీముద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీను నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.