పుణే : భారత వాయుసేన(ఐఏఎఫ్)లో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువకుడిని రూ 6 లక్షలకు మోసగించిన ముగ్గురు నిందితులపై పింప్రి చించ్వాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐఏఎఫ్ లోగోతో కూడిన నకిలీ జాయినింగ్ లెటర్, నకిలీ ఐఏఎఫ్ యూనిఫాంను ఉపయోగించి నిందితులు 29 ఏండ్ల యువకుడిని బోల్తా కొట్టించారు. ఐఏఎఫ్ అధికారిగా చెప్పుకునే తమ దూరపు బంధువు కూడా నిందితులకు సహకరించాడని బాధిత యువకుడు పేర్కొన్నాడు.
ఐఏఎఫ్ యూనిఫాంలో తనకు పరిచయమైన నిందితుడు తనకు ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ ఆరు లక్షలు తీసుకుని మోసగించాడని తెలిపాడు. ఆపై ఉద్యోగం గురించి తాను ప్రశ్నించగా నకిలీ జాయినింగ్ లెటర్ పంపాడని తెలిపాడు. త్వరలోనే హైదరాబాద్లో శిక్షణ ఇస్తారని నమ్మబలికాడని ఆపై తాను ఫోన్ చేసినా పట్టించుకోలేదని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.