బంజారాహిల్స్ : బంజారాహిల్స్లో పట్టపగలే గుర్తుతెలియని దుండగులు కత్తితో బెదిరించి ఓ మహిళా బ్యాంక్ మేనేజర్ వద్దనుంచి బ్యాగ్ లాక్కెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని అపర్టా ఆరా అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్న కృష్ణవేణి శర్మ చిరాగ్ అలీ లేన్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తోంది.
ఈనెల 25న మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నెం 12లో నివాసం ఉంటున్న ఓ కస్టమర్ను కలిసేందుకు ఆటోలో వచ్చిన కృష్ణవేణి కమాండ్ కంట్రోల్ వద్ద దిగింది. అర్బన్ సూపర్ మార్కెట్ ఎదురుగా నడుచు కుంటూ వెళ్తున్న సమయంలో యాక్టివా బైక్ మీద వచ్చిన ముగ్గురు ఆగంతకులు ఆమెను అటకాయించారు.
తమవద్ద ఉన్న కత్తితో బెదిరించిన దుండగులు ఆమె వద్దనుంచి బ్యాగును లాక్కొన్నారు. బ్యాగులో రూ.10వేల నగదుతో పాటు వివిధబ్యాంకులకు సంబంధించిన కార్డులు, ఇతర పత్రాలు ఉన్నాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురయిన కృష్ణవేణి గట్టిగా కేకలు వేసింది. దాంతో నిందితులు అక్కడినుంచి పరారయ్యారు.
ఈ మేరకు బాదితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులపై ఐపీసీ 392తో పాటు ఆర్స్మ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత నేరస్థులు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.