Yadadri Bhuvanagiri | యాదాద్రి భువనగిరి : యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఒకేసారి 15 ఇండ్లలో చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు. సింగారం గ్రామ సమీపంలోని బేగంపేట, జాల గ్రామాల్లో దుర్గమ్మ పండుగ నిర్వహిస్తున్నారు.
ఈ పండుగ నేపథ్యంలో సింగారంలోని చాలా మంది బేగంపేట, జాల గ్రామాల్లో ఉన్న తమ బంధువుల నివాసానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు.. తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేశారు. ఏకంగా 15 ఇండ్ల తాళాలు పగులగొట్టి.. చోరీ చేశారు. ఆ ఇండ్లలో ఉన్న విలువైన వస్తువులు, బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగలు దోచుకెళ్లినట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు రాజపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు.