హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గూగుల్ సాయంతో తండ్రి ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు, ఆయన భార్య. దీనిపై ఆ తండ్రి హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. కరీంనగర్కు చెందిన వైకుంఠానికి ముగ్గురు కుమారులు. పెద్దకొడుకు, చిన్నకొడుకు హైదరాబాద్లో.. రెండో కొడుకు రవి, అతని భార్య కరీంనగర్లో ఉంటున్నారు. ఆస్తుల విషయమై వీరి మధ్య వివాదాలు తలెత్తడంతో వైకుంఠం కూడా తన భార్యతో కలిసి కరీంనగర్లోనే విడిగా నివసిస్తున్నాడు. తండ్రి వద్ద ఉన్న ఆస్తిని కాజేసేందుకు రవి, అతని భార్య కుట్ర పన్నారు. ఇందులో భాగంగా వైకుంఠంకు తెలియకుండానే ఆయన ఫోన్లో కాల్ రికార్డింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసి దాన్ని తమ గూగుల్ అకౌంట్స్కు అనుసంధానం (సింక్) చేసుకున్నారు. అప్పటి నుంచి వైకుంఠం ఎవరితో ఏం మాట్లాడుతున్నాడన్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటున్నారు.
ఈ క్రమంలో ఇటీవల ఆయన హైదరాబాద్లోని కుమారుల వద్దకు రావాలని నిర్ణయించుకొని వారితో ఫోన్లో మాట్లాడాడు. ఇంటికి తాళాలు వేసి భద్రంగా దాచుకోవాలని ఆ ఇద్దరు కొడుకులు చెప్పడంతో.. వాటిని ఓ రహస్య ప్రదేశంలో పెట్టానని వైకుంఠం వివరించాడు. అనంతరం ఆయన హైదరాబాద్కు వచ్చి ఇద్దరు కొడుకుల వద్ద కొన్నాళ్లు ఉన్నాడు. కరీంనగర్కు తిరిగి వెళ్లిన తర్వాత ఇంటి తాళాలు వేసినట్టే ఉన్నప్పటికీ లోపల బీరువాలో దాచిన డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు కనిపించలేదు. ఎక్కడ దాచిన తాళాలు అక్కడే ఉండటంతో వైకుంఠానికి అనుమానం వచ్చి లోతుగా ఆరా తీశాడు. తన సెల్ఫోన్ను చెక్ చేయించడంతో అందులో కాల్ రికార్డింగ్ యాప్ ఇన్స్టాల్ అయిందని, అది రవి జీమెయిల్కు సింక్ అయిందని తేలింది. దీంతో తన ఇంటికి కన్నం వేసింది రవి, అతని భార్యేనని నిర్ధారించుకొన్న వైకుంఠం సోమవారం హైదరాబాద్లోని సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోయిన బంగారం, డబ్బు విలువ రూ.25 లక్షలకుపైగా ఉంటుందని వైకుంఠం తెలిపాడు. దీంతో ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టింది.