వెంగళరావునగర్ : పట్టపగలు ఇంట్లో ఉన్న ఓ మహిళ పై దాడికి పాల్పడి నిర్భందించి చోరీకి పాల్పడిన ఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అమీర్పేట ధరంకరం రోడ్డులో గురువారం జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు దాదాపు 23 లక్షల సొత్తును దోచుకుని వెళ్లాడు.
ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం…అమీర్పేట ధరంకరం రోడ్డులోని అంజనీటవర్స్లో వినోద్ పొడ్డర్ అనే వ్యాపారి తల్లిదండ్రులతో పాటు భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. వినోద్ గురువారం ఉదయం ఎప్పటిలాగే బాలానగర్లో ఉన్న తన కార్యాలయానికి వెళ్లాడు. పిల్లలు కూడా అతనితోనే వెళ్లి పోయారు.
మధ్యాహ్న సమయంలో వినోద్ భార్య కోఠిలో జరిగిన బంధువుల శుభకార్యానికి వెళ్లింది. సాయంత్రం వినోద్ తల్లిదండ్రులు బాబులాల్, దేవీలు వాకింగ్ చేసేందుకు కిందకు వెళ్లారు. ఇంటిని శుభ్రం చేసేందుకు ఎప్పటిలాగే ఇంటి పనిమనిషి అర్చన వారివద్దకు వచ్చి ఇంటి తాళాలు తీసుకుని వెళ్లింది. వాకింగ్ ముగించుకుని రెండు గంటల తరువాత పైకి వచ్చిన వినోద్ తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్ని చిందరవందరగా పడి ఉన్నాయి.
బెడ్రూమ్లోని బీరువాలో ఉన్న సామగ్రీ అంతా కిందపడిపోయి ఉన్నాయి. మరోగదికి బయటి నుండి గొళ్లెం పెట్టి ఉండటంతో దానిని తెరిచి చూడగా పనిమనిషి అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. దీంతో వెంటనే కొడుకు వినోద్కు సమాచారం అందించారు.
ఇంట్లోకి చొరబడ్డ దొంగ రూ.17 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు ఎత్తుకొని పోయినట్లు గుర్తించి ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పనిమనిషిని విచారించారు.
ఇంట్లోకి వచ్చిన దొంగ తన తలపై బలంగా కొట్టడంతో సృహతప్పి పడిపోయానని పనిమనిషి అర్చన తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.