వెంగళరావునగర్ : రెండు దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి నగదుతో పాటు అమ్మవార్ల నగలను ఎత్తుకుపోయారు. ఈ సంఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు ,ఆయా దేవాలయాల నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం…
బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయం సమీపంలో మహంకాళి దేవాలయం, గండి మైసమ్మ దేవాలయం ఉన్నాయి. వీటిని కొత్తపల్లి రాజుగౌడ్, కాసాని జగదీష్ నిర్వహణ బాధ్యతలు చూస్తారు. కాగా శుక్రవారం ఉదయం దేవాలయాలను తెరవడానికి వెళ్లగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా హుండీలు పగలగొట్టి ఉన్నాయి.
అనుమానం వచ్చిన నిర్వాహకులు అమ్మవారి మూలవిరాట్లను పరిశీలించగా నగలు కనిపించలేదు. దీంతో ఆయా దేవాలయాల్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం రూ.20 వేల విలువ చేసే సొత్తు చోరీకి గురైనట్లు గుర్తించారు.
సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.