సికింద్రాబాద్ : జియో నెంబరుకు రూ.25లక్షల లాటరీ తగిలిందంటూ గుర్తుతెలియని ఆగంతకులు ఓ యువతికి పోన్ చేసి రూ.37,400ల కుచ్చుటోపి పెట్టారు. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ బోయిన్ పల్లి మల్లిఖార్జునానగర్ కాలనీకి చెందిన ఓ యువతీ (25) జియో కంపెనీకి సంబంధించిన నెంబరును వినియోగిస్తుంది.
ఈనెల 11న ఆమెకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి తాను జియో సంస్థనుంచి మాట్లాడుతున్నానని, ఆమె సెల్ నెంబరుకు రూ. 25 లక్షల లాటరీ తగిలిందని చెప్పాడు. సదరు మొత్తాన్ని ఆమె ఖాతాకు బదలాయించేందుకుగాను రూ.3వేలను తమ ఖాతాలో జమచేయాలని చెప్పాడు. అతని మాటలను విశ్వసించిన బాధితురాలు అతని సూచనలమేరకు ఆగంతకుడు ఇచ్చిన ఖాతాలో రూ. 3వేలను జమచేసింది.
ఇదే తరహాలో అగంతకుడు చెప్పినప్పుడల్లా వివిధ సందర్భాలలో బాధితురాలు వివిధ మార్గాల్లో మొత్తం రూ.37,400 లను జమ చేసింది. అయినప్పటికీ అగంతకుడు మరోమారు రూ.4వేలను జమచేయాలని లేనిపక్షంలో తన ఖాతా బ్లాక్ చేయబడుతుందని చెప్పాడు. అందుకు అంగీకరించని బాధితురాలు తాను చెల్లించిన మొత్తాన్ని తనకు తిరిగి ఇవ్వాలని చెప్పింది. అందుకు అతను అంగీకరించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు బుధవారం పోలీసుల కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.