మెహిదీపట్నం : తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెకు మందులను కొనడానికి నగరానికి వచ్చిన ఓ యువకుడు దారి దోపిడికి గురైన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..
కోదాడకు చెందిన నాగార్జున తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెకు కావల్సిన మందులను కొనడానికి నగరానికి వచ్చాడు. ఆదివారం రాత్రి మెహిదీపట్నంలో ఆటో ఎక్కి టోలిచౌకివైపు వెళుతున్నాడు. ఈ సమయంలో అతడితో పాటు మరో ఇద్దరు యువకులు ఆటోలో ప్రయాణికుల లాగా ఎక్కారు.
నానల్నగర్ వద్దకు రాగానే ఆటోను లంగర్హౌస్ వైపు తీసుకువెళుతుండగా నాగార్జున వారిని ప్రశ్నించాడు. దీంతో వారు అతడి గొంతుపై కత్తి పెట్టి అరిస్తే చంపుతామని బెదిరించారు. అనంతరం లంగర్హౌస్ నుంచి హైదర్షాకోట్ సన్సిటీ వైపుకు ఆటో తీసుకువెళ్లి అతడి వద్ద నుంచి 3వేల రూపాయల నగదు, 20 వేల రూపాయల విలువచేసే సెల్ఫోన్ను లాక్కొని పారిపోయారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్.జీ .శివమారుతి ఆదేశాలతో లంగర్హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.