సికింద్రాబాద్: భూవివాదంలో ఇద్దరు వ్యక్తులు తమ బంధువుపై కత్తితో దాడిచేసేలా చేసింది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ యెటావా మండలం డాక్రా గ్రామానికి చెందిన కుల్దీప్సింగ్ (30) గత ఐదు సంవత్సరాలక్రితం బతుకుదెరువుకు నగరానికి వచ్చాడు.
ప్రస్తుతం అతను న్యూ బోయిన్పల్లి పెద్దతోకట్టలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థలో కూలీగా పనిచేస్తున్న కుల్దీప్ సదరు ఇంట్లో తన స్నేహితులు రాజ్వీర్, ఛోటన్లతో కలిసి ఉంటున్నాడు. ఈనెల 7న రాత్రి బాధితుడు అతని స్నేహితులు భోజనం చేసి ఇంట్లో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.
ఈ క్రమంలో బాధితుని బంధువులు విపిన్సింగ్, బ్రిజేశ్సింగ్లు ఇంట్లోకి చొరబడి కుల్దీప్తో గొడవపడ్డారు. గట్టిగా కేకలు వేస్తూ నిందితులు బాధితుడిని చితకబాదుతుండడాన్ని గమనించిన రాజ్వీర్, చోటన్లు ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తమవెంట తెచ్చిన కత్తితో బ్రిజేశ్సింగ్ బాధితుడిపై దాడిచేయడంతో అతని ఎడమచేతికి గాయాలయ్యాయి.
అంతేకాకుండా నిందితులు బాధితుడిని అక్వేరియంపై తోసేయడంతో మరోసారి గాయాలవ్వడంతో బాధితుడు కిందపడిపోయాడు. అతను మృతిచెంది ఉంటాడని అనుకున్న నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. కిందినుంచి పెద్దగా శబ్ధాలు వస్తుండడాన్ని గుర్తించిన ఇంటి యజమాని కిందకు వచ్చి చూసేసరికి బాధితుడు రక్తపు మడుగులో కిందపడి ఉన్నాడు.
దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గత సంవత్సరం బ్రిజేశ్సింగ్ భూవివాదానికి సంబంధించిన డబ్బు విషయమై బాధితునితో గొడవపడ్డాడు.
దీంతో పాటు ఇటీవల కాలంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో కుల్దీప్ బ్రిజేష్సింగ్ ఇంటికి వెళ్లిన క్రమంలో బ్రిజేష్సింగ్ భార్య బాత్రూంలో ఉంది. అయితే ఇదే విషయాన్ని బ్రిజేష్సింగ్ భార్య భర్తకు చెప్పింది.
ఈ రెండు విషయాలను మనసులో పెట్టుకొన్న బ్రిజేష్సింగ్ తనను హతమార్చాలన్న ఉద్దేశ్యంతోనే తన ఇంట్లోకి చొరబడి తనపై కత్తితో దాడి చేశాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.