హయత్నగర్ : భార్యభర్తల మధ్య గొడవ కారణంగా కుమారుడితోపాటు నిప్పంటించుకుని ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. ఈ హృదయ విదారక సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా, ముష్టిపల్లి గ్రామం, రాజ్యతండాకు చెందిన రమావత్ సువర్ణ, వెంకటేష్ దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఐదేళ్ల క్రితం వెంకటేష్, కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి వలసొచ్చి హయత్నగర్ బంజారాకాలనీలో నివాసముంటున్నాడు.
వెంకటేష్ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. వీరికి మొదటి సంతానంలో ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించారు. రెండో సంతానంలో రమావత్ కన్నయ్య(7 నెలలు) బాబు ఉన్నాడు. వెంకటేష్, సువర్ణ దంపతుల మధ్య గతంలో నుండి గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
ఈనెల 11న మధ్యాహ్నం వెంకటేష్, సువర్ణ దంపతులకు గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన బాధితురాలు ఇంట్లోని శానిటైజర్ తన ఒంటి మీద పోసుకుని కుమారుడు కన్నయ్యపై కూడా పోసి నిప్పంటించింది. వెంటనే స్థానికులు గమనించి తల్లీకుమారుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.
సువర్ణ స్వల్పంగా గాయపడి హయత్నగర్లోని షాడో ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యింది. కన్నయ్యకు తీవ్ర గాయాలు కావడంతో ఎల్బీనగర్లోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్సకు తరలించారు.
మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కన్నయ్య గురువారం మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.