న్యూఢిల్లీ: ఇంటి యజమానిని హత్య చేసిన అద్దెదారుడు, మృతదేహంతో సెల్ఫీ తీసుకుని పరారయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బీహార్కు చెందిన పంకజ్ కుమార్ అనే వ్యక్తి ఆగస్ట్ 5న సురేశ్ ఇంట్లో అద్దెకు దిగాడు. అతడు రోజూ మద్యం సేవించి ఇంటికి రావడంపై యజమాని సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేసి తిట్టేవాడు. ఈ నెల 9న కూడా పంకజ్ కుమార్ మద్యం తాగి ఇంటి రాగా సురేశ్ నిలదీశాడు. దీంతో వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి కోట్లాటకు దారితీసింది. ఈ నేపథ్యంలో పంకజ్ కుమార్ ఇంటి యజయాని సురేశ్ తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు. మృతుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ఐడీ కార్టు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, పంకజ్ కుమార్ ఆ మరునాడు ఇంటి యజమాని కుమారుడు జగదీశ్కు ఫోన్ చేశాడు. అతడి తండ్రి తిట్టడంతో ఇంటిని ఖాళీ చేసినట్లు చెప్పాడు. అయితే నాలుగు రోజుల్లోనే ఇంటిని ఖాళీ చేయడంపై అనుమానించిన జగదీశ్, ఇంటి మొదటి అంతస్తులోని అద్దె గదిలోకి వెళ్లి చూశాడు. అక్కడ తన తండ్రి సురేశ్ మరణించి ఉంటడం చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడు పంకజ్ను 24 గంటల్లోనే పట్టుకుని అరెస్ట్ చేశారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.