ముంబై : మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్తో 12 మందికి పైగా మహిళలను మోసం చేసిన బీటెక్ గ్రాడ్యుయేట్ (33)ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని థానే జిల్లాకు చెందిన విశాల్ సురేష్ చవాన్ అలియాస్ అనురాగ్ చవాన్గా గుర్తించారు. పెండ్లి పేరుతో పలువురు మహిళలను రూ లక్షల్లో మోసగించిన నిందితుడిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి చేతిలో రూ 2.5 లక్షలు మోసపోయిన బాధితురాలి (28) ఫిర్యాదు ఆధారంగా చవాన్ను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు చవాన్ విదేశీ ఎంఎన్సీ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్నని నమ్మబలుకుతూ మ్యాట్రిమోనియల్ సైట్లో యువతికి దగ్గరయ్యాడు. బాధితురాలిని మోసగించే క్రమంలో ఆమెతో పెండ్లి ఖరారు చేసుకునేందుకు ముంబై వస్తున్నానని చెప్పాడు. తన డెబిట్ కార్డు బ్లాక్ చేశారని తనకు డబ్బు కావాలని కోరగా మహిళ రూ 2.5 లక్షలు అతడి ఖాతాకు బదలాయించింది.
ఆపై ఆమెతో దూరంగా ఉండటంతో అనుమానంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టెకీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు దాదాపు 12 మందికి పైగా మహిళలను ఇదే తరహాలో మోసం చేసినట్టు వెల్లడైంది. నిందితుడిపై వెర్సోవా, సియోన్, నర్పోలి పోలీస్ స్టేషన్లలోనూ పలు కేసులు నమోదయ్యాయని ముంబై డీసీపీ (క్రైం) సంగ్రామ్ సింగ్ నిషందర్ తెలిపారు.