అమరావతి : ఏపీలో ప్రతిపక్షాలకు చెందిన దాడుల పరంపర కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయకులు, శ్రేణులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద్రయ్యను గుర్తు తెలియని దుండగులు కర్రలు, రాళ్లతో కొట్టి హత్యచేశారు. టీడీపీ మాచర్ల ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడైన చంద్రయ్య ను హత్య చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.
జగన్ సీఎం అయ్యాక ప్రజలు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రశ్నించేవారిపై దాడులు, పోరాడేవారిని అంతమొందించడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, పాలనతో ప్రజలను మెప్పించలేక ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.