లక్నో: దేశంలో క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్లో రెండు అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను బుధవారం గుర్తించారు. ఘజియాబాద్, నోయిడాలో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. దీంతో నిర్ధారణ కోసం ఇద్దరు రోగుల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఒక మంకీపాక్స్ కేసు నిర్ధారణ అయ్యింది. విదేశీ ప్రయాణ చరిత్ర లేని 31 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డాడు. దీంతో లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
అయితే ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్, నోయిడా ఢిల్లీ శివారు ప్రాంతాలు. ఈ నేపథ్యంలో ఈ నగరాల్లో ఇద్దరికి పాంకీపాక్స్ లక్షణాలున్నట్లు అనుమానిస్తుండటం కలకలం రేపుతున్నది. మరోవైపు మంకీపాక్స్ ఇప్పటికే 75 దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. మంకీపాక్స్ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.