చెన్నై: ఒక విద్యార్థిని కొందరు విద్యార్థులు కులం పేరుతో దూషించడంతో పాటు మంటల్లోకి తోసేశారు. దీంతో అతడికి కాలిన గాయాలయ్యాయి. తమిళనాడులోని విలుపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. తిండివనం పట్టణంలోని కట్టుచివిరి ప్రభుత్వ పాఠశాలలో 11 ఏండ్ల దళిత విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు అతడు ఇంటికి బయలుదేరాడు. అయితే అదే స్కూలుకు చెందిన అగ్ర కులానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఒంటిరిగా వెళ్తున్న అతడ్ని కులం పేరుతో దూషించారు. ఆటపట్టించడంతోపాటు కాలుతున్న పొదల్లోకి అతడ్ని తోసేశారు.
దీంతో ఆ విద్యార్థి కాలిన గాయాలతో ఇంటికి చేరాడు. ఇది చూసి అతడి తల్లిదండ్రులు షాకయ్యారు. ఏమైందని అడిగితే కాలుతున్న పొదల్లో పడినట్లు తొలుత అబద్ధం చెప్పాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చికిత్స కోసం కుమారుడ్ని తిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏం జరిగిందని డాక్టర్లు గట్టిగా అడగ్గా నోరు విప్పాడు. కొందరు అగ్ర కులాల విద్యార్థులు తనను కులం పేరుతో తిట్టి మండుతున్న చెట్ల పొదల్లోకి తోసేశారని చెప్పాడు. తన చొక్కాకు మంటలు అంటుకోగా సమీపంలోని చెరువులో దూకినట్లు తెలిపాడు.
దీంతో ఆ విద్యార్థి తండ్రి దీనిపై పోలీసులకు ఫిర్యాడు చేశాడు. బాధిత విద్యార్థి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు ముగ్గురు విద్యార్థులపై హత్యాయత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.