పట్నా : గతంలో తమపై ఫిర్యాదు చేసిందనే కోపంతో ఐదుగురు విద్యార్ధులు మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బిహార్లోని జమై జిల్లాలో జరిగింది. బాలిక కోచింగ్ క్లాస్లకు హాజరై తిరిగివస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు కూడా అదే కోచింగ్ సెంటర్లో చదువుతున్నాడు.
బాలిక క్లాస్ నుంచి వెనుతిరగగా నిందితులు ఆమెను బలవంతంగా సమీప అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటివరకూ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలోనూ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, దీనిపై కోచింగ్ సెంటర్ నిర్వాహకుడికి ఫిర్యాదు చేశామని బాలిక తల్లితండ్రులు తెలిపారు.
ఇక ముందు బాలికకు ఎలాంటి అసౌకర్యం కలిగించనని భరోసా ఇచ్చిన తర్వాతే బాలికను అదే కోచింగ్ సెంటర్కు పంపుతున్నామని చెప్పారు. తమపై ఫిర్యాదు చేసిందనే కక్షతో నిందితుడు మరికొందరు విద్యార్ధులతో కలిసి పధకం ప్రకారం లైంగిక దాడికి తెగబడ్డాడు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.