రోడ్లపై ఎక్కడంటే అక్కడ మూత్ర విసర్జన చేయడం మన వాళ్లకు అలవాటు. ప్రభుత్వం మూత్రశాలలు ఏర్పాటు చేసినా.. పాత అలవాటును పోనిచ్చుకోకుండా రోడ్డుపైనే చాలా మంది పని కానిచ్చేస్తున్నారు. ఇలా రోడ్డు వారగా ఓ ఇంటి గోడపై మూత్ర విసర్జన చేయడం ఓ వ్యక్తి ప్రాణాలు తీసేలా చేసింది. గోడపై మూత్రం పోస్తావా అంటూ సదరు వ్యక్తితో ఘర్షణ పడిన నలుగురు వ్యక్తులు.. ఆ వ్యక్తిని పట్టపగలే అందరూ చూస్తుండగా దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. ఈ సంఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఓ బిజీ మార్కెట్లో జరిగి కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మయాంక్ హోటల్ మేనేజిమెంట్ డిగ్రీ చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఓ రద్దీగా ఉండే ప్రాంతంలో మూత్రవిసర్జన చేశాడు. తమ ఇంటి వద్ద గోడపై మూత్రం పోయడాన్ని గమనించిన ఆ ఇంటి యజమానురాలు అభ్యంతరపెట్టింది. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు చేయి కూడా చేసుకున్నారు. తల్లిపై చేయి చేసుకోవడంతో ఆగ్రహించిన ఆమె కుమారుడు మనీష్.. తన స్నేహితులకు విషయం చేరవేసి మయాంక్ను పట్టుకునేందుకు చేజ్ చేశారు. చివరకు దక్షిణ ఢిల్లీకి చెందిన మాలవీయ నగర్లోని డీడీఏ మార్కెట్ వద్ద మయాంక్ను అడ్డగించి అందరూ చూస్తుండగానే కత్తులతో విచక్షణారహితంగా కత్తితో పొడిచి పారిపోయారు. తీవ్రంగా రక్తస్రావమైన మయాంక్ను స్థానికులు ఎయిమ్స్కు తరలించగా.. అక్కడ ప్రాణాలొదిలాడు.
విద్యార్థిని పట్టుకుని నలుగురు కత్తులతో పొడిచి చంపిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటన జరిగిన మాలవీయ నగర్లోని డీడీఏ మార్కెట్ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. మయాంక్ను నలుగురు కత్తులతో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు కారకులైన మనీష్తో పాటు అతడి స్నేహితులు రాహుల్, అశీష్, సూరజ్లుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మాలవీయ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.