ముంబై : సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతూనే ఉన్నారు. ఆన్లైన్ వేదికగా స్కామర్లు అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. పార్ట్టైం జాబ్ చేస్తూ ఇంటి నుంచే పెద్ద మొత్తంలో సంపాదించవచ్చని వల వేస్తూ టోకరా ఇస్తున్నారు. బాధితుల నమ్మకం చూరగొనేందుకు ముందు కొద్ది మొత్తం ఖాతాల్లో జమ చేసి ఆపై భారీ స్కామ్లకు తెరలేపుతున్నారు. ఇదే తరహాలో పుణేకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి స్కామర్లు ఏకంగా రూ. 16 లక్షలు కొట్టేశారు.
మే 4 నుంచి మే 8 మధ్య బాధితుడి నుంచి నిందితులు పెద్దమొత్తంలో సొమ్ము కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే బాధితుడు మే 4న ఓ యాప్లో పార్ట్టైం జాబ్ ఆఫర్ చేసే మెసేజ్ను రిసీవ్ చేసుకున్నాడు. స్కామర్లు తొలుత వీడియోలను లైక్ చేసే టాస్క్ను అప్పగించగా ఆపై అతడి ఖాతాలో కొంత మొత్తం జమ చేశారు. అధిక మొత్తం ఆర్జించేందుకు ఇతర ప్రీపెయిడ్ టాస్క్ల్లో ఇన్వెస్ట్ చేయాలని స్కామర్లు బాధితుడిని నమ్మబలికారు.
ముందుగా బాధితుడు చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయగా కమీషన్లు ముట్టచెప్పడంతో మరింత రిటన్స్ అందుకునేందుకు భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని కోరారు. ఆపై తన ఖాతాలో సొమ్మును విత్డ్రా చేసుకోవాలని బాధితుడు కోరగా ఆ డబ్బు వెనక్కి రావాలంటే మరింత మొత్తం చెల్లించాలని స్కామర్లు మభ్యపెట్టారు. ఈ క్రమంలో బాధితుడు పలు ఖాతాలకు రూ. 15.9 లక్షలు బదిలీ చేశాడు. ఇంకా డబ్బు చెల్లించాలని స్కామర్లు ఒత్తిడి చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More
Sweden | స్వీడన్లో సెక్స్ చాంపియన్షిప్.. జంటల మధ్య కెమిస్ట్రీ ఆధారంగా విజేతల ఎంపిక