మహబూబ్నగర్ : ఊర కుక్కలు వెంబడించడంతో.. భయంతో గొర్రెలు గ్రామ శివారులోని రైలు పట్టాలపైకి వచ్చాయి. అప్పుడే వేగంగా వచ్చిన రైలు ఆ గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 335 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటన దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కౌకుంట్లకు చెందిన పెద్ద మాసన్న, దూలన్న, తిరుపతయ్యకు చెందిన దాదాపు 500 గొర్రెలను గురువారం రాత్రి గ్రామ రైతు వేదిక వద్ద ఆపారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సయమంలో ఊర కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. దీంతో భయంతో గొర్రెలు గ్రామ శివార్లలోకి పరుగులు పెట్టాయి. దగ్గరలోని రైల్వే ట్రాక్ దాటుతుండగా ఆ సమయంలో వచ్చిన రైలు గొర్రెలను ఢీకొట్టింది.
దీంతో మాసన్నకు చెందిన 160 గొర్రెలు, దూలన్నవి 100 గొర్రెలు, తిరుపతయ్యవి 75 గొర్రెలు మొత్తం 335 గొర్రెలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న తాసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసులు, పశువైద్యులు జీసన్అలీ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ప్రాణాలు కోల్పోయిన గొర్రెల విలువ రూ.33.50 లక్షలు ఉంటుందని తెలిపారు.