వెంగళరావునగర్ : ఆమెకు ఇద్దరు భర్తలు.. నా భార్యంటే నా భార్యని ఇద్దరు భర్తలు ఆమె కోసం గొడవ పడ్తున్నారు. భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలి..పుట్టింటికెళ్లొస్తానని చెప్పి వెళ్లిన ఆ మహిళ ప్రియుడ్ని పెళ్లాడింది. మొదటి భర్త ఫిర్యాదుతో మహిళతో పాటు ఆమె రెండో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
తీరా జైలునుంచి విడుదలయ్యాక రెండో భర్తతో ఎస్ఆర్ నగర్లో కాపురం చేయసాగింది. నా బిడ్డలకు తల్లి ప్రేమ కావాలి.. నా భార్యను నాకు అప్పగించండంటూ మొదటి భర్త పోలీసుల్ని వేడుకుంటున్నాడు. కాగా.. రెండో భర్త వద్ద ఉండే ఆ మహిళ అక్కడి నుంచి అదృశ్యం కావడంతో అతను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆవిడే కావాలంటూ ఇద్దరు భర్తలు ఠాణా మెట్లెక్కారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ టీచర్స్ కాలనీ -2 లో నివాసముండే లంకా శశికాంత్ (42) ఓ దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు 1999 ఫిబ్రవరి 2న ఖాజీపేట్కు చెందిన దుర్గా సుశీల ఉరఫ్ నాగసాయి వెంకట దుర్గా సత్యాదేవి (35)తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది.
ఈ దంపతులకు పదహారేళ్ల కుమారుడు, పదమూడేళ్ల కుమార్తె ఉన్నారు. గత ఆగస్టు 20న పుట్టింటికెళ్లి వస్తానని చెప్పి బయల్థేరిన సుశీల మళ్లీ తిరిగిరాలేదు. ఇంట్లోని 10 తులాల బంగారు నగలు, 25 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు కనిపించలేదు.
భార్య కోసం బంధువులు, ఆమె స్నేహితుల ఇళ్లల్లో గాలించినా ఆచూకీ లేకపోవడంతో తన భార్య దుర్గా సుశీల ఏపీలోని అమలాపురం కొత్తపేట్కు చెందిన డ్యాన్సరైన ప్రియుడు రాయుడు సత్యవరప్రసాద్తో పారిపోయిందని..బంగారం, వెండి, డబ్బు తీసుకెళ్లిందని మొదటి భర్త శశికాంత్ ఫిర్యాదుతో సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా శశికాంత్ తన మొదటి భర్త కాదని..అతను తన బావ అని..తన అక్క చనిపోతే చుట్టపుచూపుగా వెళ్లానని..ఆ పిల్లలు తన పిల్లలు కాదంటూ ట్విస్ట్ ఇచ్చింది సుశీల. అయితే పోలీసులు విచారణ చేపట్టగా శశికాంత్ సుశీలకు మొదటి భర్తేనని తేలింది. ఆ ఇద్దరు పిల్లలు కూడా సుశీల పిల్లలేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
భర్తను వదిలి హైదరాబాద్ చేరిన సుశీల ఎస్ఆర్ నగర్ బల్కంపేట్ ప్రశాంత్కాలనీలో ఉంటూ తన ప్రియుడు సత్యవరప్రసాద్తో సహజీవనం చేయసాగింది. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహాల్లో ప్రియుడు సత్యవరప్రసాద్ను సుశీల పెళ్లి చేసుకుంది.
మొదటి భర్త ఫిర్యాదుతో సుశీలతో పాటు ఆమె ప్రియుడ్ని కూడా సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జైలునుంచి విడుదలయ్యాక బల్కంపేట్ ప్రశాంత్నగర్ లో కాపురం చేయసాగారు. ఇదిలా ఉండగా భర్తలిద్దరూ సుశీల కోసం గొడవ పడ్తున్నారు.
ఇద్దరూ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్తల గొడవ ఇలా ఉండగా రెండో భర్త రాయుడు సత్యవరప్రసాద్ ఇంటి నుంచి సుశీల అదృశ్యమైంది. దీంతో 3 నెలల గర్బవతైన తన భార్య దుర్గ అదృశ్యమైందంటూ రెండో భర్త సత్యవరప్రసాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.