అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గంజాయి విక్రయదారులు రోజుకో అడ్డదారిని తొక్కుతున్నారు. ఎలాగైనా అతి తక్కువ సమయంలో కోట్లకుపడగలెత్తాలనే ఉద్దేశంతో రోడ్డు, ఇతర మార్గాల్లో గంజాయిని సరఫరా చేస్తున్న విక్రయదారులు ప్రస్తుతం రూట్ను మార్చారు. వినియోగదారులకు నిషేదిత జాబితాలో లేని అన్ని రకాల వస్తువులను ఈ కామర్స్ సంస్థలు నేరుగా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిషేదిత గంజాయి లాంటి మత్తు పదార్థాలను కూడా సరఫరా చేస్తే ఎవరికి అనుమానం రాదనే అనుమానంతో కొందరు అమెజాన్ సంస్థను ఎంపిక చేసుకొని గంజాయిని సరఫరా చేస్తున్నారు.
పసిగట్టిన విశాఖ పోలీసులు నిఘా ఉంచి విశాఖకు చెందిన ఐదుగురిని, మధ్యప్రదేశ్కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ సతీశ్కుమార్ వెల్లడించారు. ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ద్వారా హెర్బల్ ఉత్పత్తులు, కరివేపాకు పేరిట విశాఖ నుంచి మధ్యప్రదేశ్తోపాటు ఇతర ప్రాంతాలకు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు . వీరి వద్ద నుంచి 48 కిలోల గంజాయి, ఒక మోపెడ్, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్, గంజాయి ప్యాకింగ్ మెటీరియల్, అమెజాన్ టేపులు, బ్యాగ్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
ఈ కేసులో ఇద్దరు అమెజాన్ డెలివరీ బాయ్స్ పాత్ర ఉందని వెల్లడించారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేసి, నిందితులు జీరు కృష్ణమూర్తి, బిజ్జం కృష్ణంరాజు, చిలకపాటి మోహన్ రాజును చీపురుపల్లి వెంకటేశ్వరరావు, చిలకపాటి శ్రీనివాసరావు అరెస్ట్ చేసినట్టు ఎస్ఈబీ జేడీ వెల్లడించారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన సూరజ్, ముకుల్ జైస్వాల్లను అరెస్ట్ చేసినట్లు జేడీ పేర్కొన్నారు.