Gold Smuggling | గత జనవరి నుంచి అక్టోబర్ వరకు రికార్డు స్థాయిలో 3,917.52 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని జప్తు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు బంగారం స్మగ్లింగ్పై దేశవ్యాప్తంగా 4,798 కేసులు నమోదు చేశామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో వెల్లడించారు. 2020లో 2,567 కేసుల్లో 2,155 కిలోల స్మగుల్డ్ బంగారం, 2021లో 2,445 కేసుల్లో 2,383 కిలోల స్మగుల్డ్ బంగారం 2022లో 3,982 కేసుల్లో 3,502.16 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని జప్తు చేసినట్లు పంకజ్ చౌదరి తెలిపారు.
ఇతర దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ విమానాశ్రయాలతో సహా వివిధ రూట్లలో బంగారం స్మగ్లింగ్ను అరికట్టేందుకు కస్టమ్స్ అధికారులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు నిరంతరం నిఘా పెట్టినట్లు పంకజ్ చౌదరి చెప్పారు. భారతీయులతో కలిసి విదేశీయులు సిండికేట్గా వ్యవహరించిన ఘటనల్లో 2020 నుంచి ఏడు కేసులు నమోదయ్యాయని వివరించారు.